కేసీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు.. తాగుబోతే నయం: రేవంత్ రెడ్డి ఫైర్

శనివారం, 7 అక్టోబరు 2017 (14:27 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలు అధికారం అప్పగించగానే కేసీఆర్ సర్వం తానేనని అనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రొఫెసర్ కోదండరామ్‌ను వాడు, వీడు అని సంబోదించడం సబబేనా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయినా కోదండరామ్ తప్పుగా ఏం మాట్లాడారని నిలదీసారు. సింగరేణి ఎన్నికల్లో ప్రతిపక్షాల అనైక్యత వల్లే తెరాస గెలిచిందన్నారు. 
 
విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే తెరాస గెలిచేది కాదన్నారు. నువ్వు వాడు, వీడు అని మాట్లాడితే కేసీఆర్‌ను ఎలా సంబోధించాలని ప్రశ్నించారు. నీ ఇంటికి కోదండరామ్ ఇల్లు ఎంత దూరమో.. కోదండరామ్ ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరమని గుర్తించుకో అని కేసీఆర్‌కు రేవంత్ హితవు పలికారు. 
 
కేసీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని, తాగుబోతైనా పద్ధతిగా మాట్లాడుతాడని.. తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ వీరులనే విషయాన్ని గుర్తు చేసుకోమన్నారు. కోదండరామ్ తెలంగాణ ద్రోహా అని నిలదీశారు. తాగుబోతు అయినా తల్లిని తల్లి, చెల్లిని చెల్లి అంటాడని, కానీ నువ్వు మాత్రం అలా కాదని ఆయన మండిపడ్డారు. ఇందుకేనా తెలంగాణ ప్రజలు నీకు పట్టంకట్టింది? అని ఆయన నిలదీశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు