డ్రగ్స్ ఏ ఒక్కరి విడి సమస్యా కాదు.. సినీ పరిశ్రమను కించపరచడం సరికాదు: వెంకయ్య

సోమవారం, 31 జులై 2017 (07:37 IST)
మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వాడకం అనేది విశ్వవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు దాన్ని సవాలుగా స్వీకరించాలే తప్ప ఏ ఒక పరిశ్రమలో లేక విభాగానికి సంబంధించిన సమస్యగా చూడరాదలని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సంఘటనలు సినీ పరిశ్రమకు చెందిన వారే ఉన్నారని ప్రచారం చేస్తూ కించపరచడం మంచిది కాదన్నారు.  
 
అయితే సినిమా వాళ్లు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటారు కాబట్టి ప్రజలకు అలాంటివారు మార్గదర్శకంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో బాధ్యతతోనూ, సంయమనంతోనూ వ్యవహరించాల్సిన గురుతర బాధ్యత మీడియాపై ఉందన్నారు.
 
బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద ఆదివారం కళామందిర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘సే నో టు డ్రగ్స్‌’పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి వెంకయ్యనాయుడుతో పాటు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, వనజీవి రామయ్య, ఆబ్కారీ శాఖ కమిషనర్‌ చంద్ర వదన్, డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్, జీవిత, రాజశేఖర్, గిరిబాబు, మా అధ్యక్షుడు శివాజీ రాజా, కార్యదర్శి నరేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, కళామందిర్‌ ఫౌండేషన్‌ నిర్వాహకుడు కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... డ్రగ్స్‌ సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా కేబీఆర్‌ పార్కు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు వాకింగ్ నిర్వహించారు.
 

వెబ్దునియా పై చదవండి