అన్నయ్యతో నిశ్చితార్థం.. తమ్ముడితో పెళ్లి.. ఆమె ఆత్మహత్య..?

సోమవారం, 9 ఆగస్టు 2021 (10:48 IST)
అన్నయ్యతో నిశ్చితార్థం జరిగింది. కానీ తమ్ముడితో పెళ్లైంది. చివరికి వరకట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన షాహీన్ బేగం (25) అనే వివాహిత మహిళ ఆత్మహత్యకి పాల్పడింది. 
 
షాహీన్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా అత్తవారింటి వేధింపులకు తోడు భర్త వేధింపులు కలిసే ఈ మరణానికి కారణంగా తేల్చారు. షాహీన్ బేగంకు ఇస్మాయిల్ తో కొన్ని నెలల క్రితమే పెళ్లయింది. అయితే, పెళ్లి రోజు నుండే వేధింపులు మొదలయ్యాయి.
 
షాహీన్ కు ముందుగా ఇస్మాయిల్ అన్నతో నిశ్చతార్థం జరిగింది. నిశ్చతార్థం అనంతరం అన్నదమ్ములిద్దరూ పని నిమిత్తం దుబాయ్ వెళ్లగా మూడేళ్ళ అనంతరం తమ్ముడు ఇస్మాయిల్ తిరిగి వచ్చాడు కానీ అన్న రాలేకపోయాడు. దీంతో అన్నతో నిశ్చతార్థం జరిగిన షాహీన్‌తో ఇస్మాయిల్ కు పెళ్లి చేశారు. అయితే.. పెళ్లి తర్వాత అన్నతో నిశ్చతార్థం చేసుకొని తనను ఎందుకు చేసుకున్నావని వేధించడం మొదలుపెట్టాడు.
 
పెళ్లి సమయంలో ఇస్మాయిల్‌తో సహా అందరూ ఇష్టపడే ఈ పెళ్లి జరగగా పెళ్ళైన తర్వాత ఇస్మాయిల్ వేధింపులు మొదలుపెట్టాడు. దీనికి తోడు అత్తవారింట్లో కట్నం వేధింపులు కూడా తోడవడంతో కొన్నాళ్ళు భరించిన షాహీన్ చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు