హాట్ హీరోయిన్‌ను పెళ్లాడనున్న హీరో కమ్ విలన్... ఎవరు?

శుక్రవారం, 31 జులై 2020 (09:06 IST)
దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ఆది పినిశెట్టి. ఆరంభంలో హీరోగా కనిపించారు. అయితే, ఆయనకు హీరోగా సినీ అవకాశాలు పెద్దగా రాకపోవడంతో విలన్‌గా మారిపోయాడు. విలన్ పాత్రల్లో పలు చిత్రాల్లో కనిపించారు. ముఖ్యంగా, అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించాడు. 
 
అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇపుడు ఈ హీరో కమ్ విలన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. తనతో కలిసి రెండు సినిమాల్లో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానీని వివాహం చేసుకోబోతున్నాడట. కొద్ది రోజులుగా తమిళ మీడియాలో ఆది పినిశెట్టి పెళ్లి వార్త హల్‌చల్ చేస్తోంది. 
 
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'మలుపు', 'మరకతమణి' అనే చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత అంటే గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన రవిరాజా పినిశెట్టి బర్త్‌డే వేడుకల ఫొటోల్లో కూడా నిక్కీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 
 
కరోనా సమస్య తొలిగిపోయిన తర్వాత తన పెళ్లి గురించి ఆది ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. అయితే తమ పెళ్లి గురించి జోరుగా వార్తలు వస్తున్నా అటు ఆది కాని, ఇటు నిక్కీ కాని ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు