అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తలకు వారి భార్యల నుంచే ప్రాణాపాయం పొంచివుంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న పలువురు మహిళలు.. తమ ప్రియులతో చేతులు కలిపి భర్తలను హత్య చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల పలకలూరు గ్రామంలో ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే భార్య హత్య చేయించింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పలకలూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గోవింద రాజులు (40)కు, లక్ష్మీ అనే మహిళతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్తతో గొడవపడి ఆరేళ్లుగా లక్ష్మి విడిగా ఉంటోంది. కొంతకాలంగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 18న సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన గోవింద రాజులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడి కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భార్య లక్ష్మి.. గోవిందరాజును హత్య చేయించించినట్లు నిర్ధారించారు. అనంతరం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. గోవిందరాజుకు మద్యం తాగించి వెంకటేశ్వర్లు, ఖాసిం సైదా హత్య చేశారని ఎస్పీ తెలిపారు నిందితులు ఉపయోగించిన ఆటో ద్వారా ముగ్గురిని పట్టుకున్నామని వివరించారు.