తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా తన 100వ సినిమా కావడంతో రూ.100 కోట్ల భారీ బడ్జెతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వశిష్టాదేవిగా శ్రేయ నటిస్తుంటే, బాలకృష్ణకి తల్లిగా గౌతమి పాత్ర్రలో అలనాటితార హేమమాలిని నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలావుంటే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే తన తదుపరి చిత్రం కోసం బాలయ్య రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బాలకృష్ణ తన 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో ''రైతు'' అనే చేస్తున్నట్టు బాలయ్య ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బుధవారం బాలకృష్ణ రామోజీ ఫిలిం సిటీలో రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ''సర్కార్-3'' షూటింగ్లో పాల్గొంటున్న అమితాబ్ బచ్చన్ను కలిశారు.
ఆ సందర్భంగా బాలయ్య వెంట కృష్ణవంశీ కూడా ఉండటం విశేషం. డిసెంబర్లోనే ''రైతు'' సెట్స్ మీదికి వెళ్తుందని కృష్ణవంశీ నుంచి స్పష్టం వచ్చింది. అయితే బాలయ్య-కృష్ణవంశీ కలిసి అమితాబ్ బచ్చన్ను కలవడానికి ప్రత్యేక కారణం ఉండొచ్చన్న ఊహాగానాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. బాలకృష్ణ 101వ సినిమాలో అతిథి పాత్ర పోషించాలని బాలయ్య.. బిగ్-బిని అడిగాడని కూడా ఒక ప్రచారం మొదలైపోయింది. ప్రస్తుతం ఈ వార్తే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.