భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

ఠాగూర్

సోమవారం, 14 జులై 2025 (21:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భర్త అక్రమ సంబంధాన్ని భరించలేని ఓ దంత మహిళా వైద్యురాలు బలన్మరణానికి పాల్పడింది. భర్త వివాహేతర సంబంధంతో పాటు అత్తింటివారి వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన ఆమె తనువు చాలించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ములుగు జిల్లా కమలాపూర్ మండలం మంగపేటకు చెందిన డాక్టర్ సృజన్‌తో వరంగల్‌కు చెందిన దంత వైద్యురాలు ప్రత్యూషకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. గత యేడాది హాసన్‌పర్తిలోని ఓ వింటేజ్ విల్లాలో స్థిరపడ్డారు. 
 
సృజన్‌కు హన్మకొండకు చెందిన ఒక యువతితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో తన కుటుంబాన్ని సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. పైగా, భార్యను మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. అత్తమామలు సైతం కుమారుడికే వత్తాసు పలుకు ప్రత్యూషను నిరంతరం వేధించసాగారు. 
 
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రత్యూష.. ఆదివారం భర్త ఇంట్లో ఉండగానే ఉరేసుకుంది. ఇది గమనించిన భర్త, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే, ప్రత్యూష శరీరంపై గాయాలు ఉండటంతో ఆమె తల్లిదండ్రులు హాసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు తమ  ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి