రచయితగానే కాకుండా విలక్షణమైన నటుడిగా.. దర్శకుడిగా.. నిర్మాతగా పోసాని కృష్ణ మురళీ టాలీవుడ్లో రాణిస్తున్నాడు. పోసాని ఏది మాట్లాడినా అందులో ముక్కుసూటి తనం ఉంటుంది. సినిమాలకి సంబంధించినంత వరకూ ఆయన ఏం చేసినా అందులో స్పెషాలిటీ ఉంటుందనే విషయం ప్రేక్షకులకి అర్థమైపోయింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ తను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పే పోసాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పోసాని తనదైనశైలిలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మెగాస్టార్ చిరంజీవి చాలా నిజాయితీ పరుడు. ఎందుకంటే, గతంలో తనకు ప్రజారాజ్యం పార్టీ సీటు ఇచ్చినపుడు ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు. అయితే, నేను డబ్బు ఖర్చు పెట్టలేకపోవడం వల్లే నాడు ఓడిపోయాను'' అని పోసాని ఆరోజు విషయాలను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని మళ్లీ ప్రారంభిస్తే కనుక ఆయన వెంట నడవడానికి తాను మళ్లీ సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రశ్నించగా.. ఒక వ్యక్తి గురించి తాను మాట్లాడాలంటే, ఆ వ్యక్తి నిజాయితీ పరుడైనా అయి ఉండాలి, లేదా, చెడ్డ వ్యక్తిత్వం గలవాడైనా అయి ఉండాలి అని అన్నారు. జనసేన పార్టీ గురించి ప్రశ్నించగా.. ఆ పార్టీ గురించి ఇంతవరకూ తనకేమీ అర్థం కాలేదని, అర్థమయ్యాక దీనికి సమాధానం చెబుతానని పోసాని చెప్పుకొచ్చారు.