కర్ణిసేన వైట్ హౌస్ ముందు ధ‌ర్నా చేస్తుందా? స్కూల్ బస్సుపై దాడి చేయలేదట

గురువారం, 25 జనవరి 2018 (16:20 IST)
''పద్మావత్'' సినిమాకు నిరసనగా కర్ణిసేన చేస్తున్న ఆందోళనలపై ప్రజలు మండిపడుతున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంకా కర్ణిసేనకు ఉద్భోధలు కూడా చేస్తున్నారు. పద్మావత్ సినిమా చూడాలనుకుంటున్న వారిని కర్ణిసేన భయపెడుతుందంటున్నారు.

ఇంకా ట్విట్టర్లో మీమ్స్, జోకులు పేలుతున్నాయి. సినిమాలో అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు ఏం లేవ‌ని రాజ్‌పుత్‌లు అన‌వ‌స‌రంగా నిర‌స‌న‌లు చేస్తున్నార‌ని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ''పద్మావత్'' సినిమా అమెరికాలో విడుదలైతే.. కర్ణిసేన వైట్ హౌస్ ముందు ధర్మా చేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. 
 
సినిమాలో యుద్ధ స‌న్నివేశం, థియేట‌ర్ బ‌య‌ట యుద్ధ స‌న్నివేశం ఒకేలా ఉన్నాయని, డియర్ కర్ణిసేన.. పీవీఆర్ థియేటర్లో మా ఆవిడ సినిమా చూస్తోందని.. దయచేసి అక్కడికి వెళ్లండంటూ జోకులేస్తున్నారు. కర్ణిసేన పద్మావతి రాణి గురించి ఓ డాక్యుమెంటరీ తీసి విడుదల చేయాల్సిందని.. ఆ డాక్యుమెంటరీని ''పద్మావత్'' ఇంటర్వెల్‌ సమయంలో వేస్తే బాగుంటుందని నెటిజన్లు కర్ణిసేనకు హితవు పలుకుతున్నారు. ఇలా చేసివుంటే చరిత్ర పాఠం ఏంటో సంజయ్ తప్పేంటో అర్థమైపోయేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... ఢిల్లీ, గుర్గావ్‌లో బుధవారం జీడీ గోయెంకా స్కూల్‌ బస్సుపై కర్ణిసేన దాడికి పాల్పడింది. ఈ ఘటన చిన్నారులకు భయానక అనుభవాన్ని మిగిల్చింది. పద్మావత్ సినిమా విడుదల అవ్వడానికి వీల్లేదంటూ రాజ్‌పుత్ కర్ణిసేనలు రహదారిపై వెళుతోన్న స్కూల్ బస్సు అద్దాలు పగులకొట్టారు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల ఈ కేసులో 18 మంది నిందితులని గుర్తించారు. వారిని అరెస్ట్ చేశారు. అయితే కర్ణిసేన మాత్రం స్కూల్ బస్సుపై దాడిలో మా ప్రమేయం లేదని.. కొందరు రాజకీయ నాయకుల కుట్ర అని ఆరోపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు