సినీ నటి హన్సిక మొత్వానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలంటూ ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై డొమెస్టిక్ వైలెన్స్ కేసు గతంలో నమోదైన విషయం తెల్సిందే. జస్టిస్ సారంగ్ కొత్వాల్, జస్టిస్ ఎస్ఎం మోదక్లతో కూడిన ధర్మాసనం హన్సిక సోదరుడి భార్యకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ మూడో తేదీకి వాయిదా వేసింది.
హన్సిక సోదరుడు ప్రశాంత్ మొత్వానీ టీవీ నటి ముస్కాన్ జేమ్స్ను గత 2020లో వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల వారు 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో హన్సిక సహా సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై ముస్కాన్ గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో గత ఫిబ్రవరి నెలలో హన్సిక, జ్యోతిలకు ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. ఈ నేపథ్యంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక, ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు.