పవన్‌కు కంటికి ఆపరేషనా.. ఏమైంది..? శ్రీవారు మౌనంగా వున్నారు..

గురువారం, 21 జూన్ 2018 (15:54 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటికి శస్త్రచికిత్స జరుగనుంది. ఈ నెల 24వ తేదీన కంటికి ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు నిర్ణయించారు. గత మూడు నెలలుగా ఆయన కంటి సమస్యతో పవన్ బాధపడుతున్నారు. అందుకే తన పోరాట యాత్రలో నల్లటి కళ్లజోడు ధరించి కనపడ్డారు. మరోవైపు ఈనెల 26 నుంచి ఆయన యాత్ర విశాఖ జిల్లాలో పున:ప్రారంభం కానుంది. 
 
తన భద్రతా సిబ్బందిలో ఉన్న ముస్లింల కోసం రంజాన్ సందర్భంగా యాత్రకు ఆయన తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ గ్యాప్ లోనే కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని భావించారు. అయితే, కొంతకాలం ఆగాలని వైద్యులు సూచన మేరకు శస్త్రచికిత్స వాయిదా పడింది. కంటిలో ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ఆపరేషన్ చేస్తున్నట్లు సమాచారం. 
 
మరోవైపు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి నగలకు సంబంధించి పెద్ద చర్చే జరుగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌ను కలిశానని.. ఆయన ఈ భేటీ సందర్భంగా టీటీడీ నగలపై కీలక విషయాలను తనకు చెప్పారని.. ఈ విషయం విపక్ష నేతలు, టీడీపీ నేతలకు కూడా తెలుసునని తెలిపారు. 
 
స్వామివారి నగలు మధ్యప్రాచ్య దేశాలకు ఓ ప్రైవేట్ విమానంలో తరలివెళ్లాయని.. అందుకే తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు తనకు ఆశ్చర్యం అనిపించలేదన్నారు. వేంకటేశ్వరస్వామి మౌనంగా ఉన్నారు... ఆయన నగలను దొంగిలించవచ్చని దొంగలు అనుకుంటున్నారు అంటూ ట్వీట్ చేశారు. 
 
పింక్ డైమండ్, ఇతర నగలకు సంబంధించి ఏపీ సర్కారు చెప్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవని.. పింక్ డైమండ్ భక్తులు నాణేలు విసరడం ద్వారా పగిలిపోయిందని చెప్పడం నమ్మశక్యంగా లేవన్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో నాణేలు విసిరితే వజ్రం ఎలా పగులుతుందో చేసి చూపించాలని పవన్ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు