కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అల్లు అర్జున్ విరాళం.. మొత్తం రూ.1.25 కోట్లు

శుక్రవారం, 27 మార్చి 2020 (13:11 IST)
కరోనా వైరస్‌పై భారత్ యుద్ధం చేస్తోంది. ఇందులోభాగంగా, దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ఎలాంటి పనులు లేక నిరుపేదలు, కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు. పైగా, పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. 
 
అలానే ఎందరో పోలీస్ అధికారులు, డాక్టర్లు, ఆరోగ్య శాఖలో ఉన్న అధికారులు, శానిటేషన్ వర్కర్లు ఇలా ఎందరో ధైర్యంగా మన గురించి పని చేస్తున్నారు. ఇక ఇలాంటి విప‌త్తులు వ‌చ్చిన ప్ర‌తిసారీ సాయానికి చిత్ర ప‌రిశ్ర‌మ ఎప్పుడూ ముందుంటుంది. 
 
ఈ పంథాలోనే తాజాగా క‌రోనాపై పోరాటానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలకు త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.1.25 కోట్లు విరాళం అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.
 
ఈ మొత్తం నిధులో రూ.50 ల‌క్ష‌లు ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్‌కు మ‌రో రూ.50 ల‌క్ష‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందిస్తున్న‌ట్లుగా అల్లు అర్జున్ తెలిపారు. ఇక మ‌రో రూ.25 ల‌క్ష‌లు కేర‌ళ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నారు. 
 
గ‌తంలో కూడా ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించారు. కేర‌ళ వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న‌ప్పుడు రూ.25 ల‌క్ష‌లు, చెన్నై వ‌ర‌ద‌లు వ‌చ్చిప్ప‌డు రూ.25 ల‌క్ష‌లు విరాళాలు అల్లు అర్జున్ అందించిన సంగ‌తి తెలిసిందే. 
 
ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ దేశ ప్ర‌ధాని మోడీ,  రాష్ట్రా ముఖ్య‌మంత్రుల ఆదేశాలు మేర‌కు 21 రోజులు లాక్ డౌన్‌ని మనంద‌రం క‌చ్ఛితంగా పాటిద్ధామన్నారు. 
 
మనకోసం ఎలాంటి ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకి, డాక్టర్లకి, అలానే కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు