ఈ ముసలాడ్ని మునగ చెట్టు ఎక్కిస్తున్నట్టున్నావు : చెర్రీ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందన

ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (15:22 IST)
హైదరాబాద్ నగరంలో శనివారం ఫార్ములా ఈ మెయిన్ రేస్ జరిగింది. ఇందులో అనేక మంది సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేసును వీక్షించేందుకు ప్రముఖ వ్యాపారదిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా వచ్చారు. అలాగే, సచిన్ టెండూల్కర్, రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా హీరో చెర్రీతో కలిసి సందడి చేశారు. 
 
ఆనంద్ మహీంద్రా... రామ్ చరణ్‌తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. రామ్ చరణ్ వన్, టూ, త్రీ చెబుతుండగా... ఆనంద్ మహీంద్రా ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 
 
హైదరాబాద్ గ్రాండ్ ప్రీ సందర్భంగా తనకు నిజమైన బోనస్ లభించిందని, నాటు నాటు పాటకు సంబంధించి బేసిక్ డ్యాన్స్ స్టెప్పులు ఎలా వేయాలో రామ్ చరణ్ నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు. థాంక్యూ రామ్ చరణ్... మీ నాటు నాటు పాట ఆస్కార్‌లో విజేతగా నిలవాలని కోరుకుంటున్నాను అని ఆకాంక్షించారు. 
 
కాగా, ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై చెర్రీ కూడా తనదైనశైలిలో స్పందించారు. "ఆనంద్ మహీంద్రా గారూ... ఈ స్టెప్పులను నాకంటే మీరే త్వరగా నేర్చుకున్నారు" అంటూ ప్రశంసించారు. "మీతో ఎంతో సరదాగా గడిచిపోయింది" అంటూ ట్వీట్ చేశారు. 
 
అందుకు ఆనంద్ మహీంద్రా తిరిగి సమాధానమిస్తూ, 'మంచిది, ఎందుకంటే మనిద్దరం ఒకే స్కూల్లో (లారెన్స్ లవ్ డేల్) చదువుకున్నాం కాబట్టి. కానీ, నువ్వు ఈ ముసలాడ్ని మునగ చెట్టు ఎక్కిస్తున్నట్టున్నావు' అంటూ చమత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons from @AlwaysRamCharan on the basic #NaatuNaatu steps. Thank you and good luck at the Oscars, my friend! pic.twitter.com/YUWTcCvCdw

— anand mahindra (@anandmahindra) February 11, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు