సినిమా టిక్కెట్ల తగ్గింపు వల్ల నా సినిమాకు నష్టంలేదు: నాగార్జున

బుధవారం, 5 జనవరి 2022 (19:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం సినిమా టిక్కెట్లను తగ్గించడంపై పెద్ద వివాదమే సాగుతోంది. ఈ వివాదంపై ఒక్కొక్కరు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో హీరో అక్కినేని నాగార్జున నటించిన "బంగార్రాజు" చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆ చిత్రం బృందం బుధవారం హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, ఇందులో సినిమా టిక్కెట్ల ధరల విషయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రస్తుతం ఏపీలో టిక్కెట్ ధరల చర్చ సాగుతోంది కదా దీనికి మీరేమంటారు అంటూ ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనికి నాగార్జున సమాధానమిస్తూ, ఇది సినిమా వేదిక. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు. నేను మాట్లాడను. అయినా టిక్కెట్స్ రేట్స్ వల్ల నా సినిమాకి ఇబ్బంది అయితే లేదు. మిగిలినవారి సంగతి నాకు తెలియదు" అని నాగార్జున అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
కాగా, ఈ చిత్రంలో తన తనయుడు అక్కినేని నాగ చైతన్య, కీర్తిశెట్టి, రమ్యకృష్ణలు హీరోయిన్లు కాగా, హైదరాబాద్ అమ్మాయి ఫరీదా అబ్దుల్లా ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. గతంలో వచ్చిన "సోగ్గాడే చిన్ని నాయనా" చిత్రానికి ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు