జయలలితకు అవమానం.. కమల్ హాసన్‌పై ఫిర్యాదు... ఎలా?

శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:31 IST)
అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అవమానం జరిగింది. దీంతో మక్కల్ నీతిమయ్యం అధినేత, సినీ నటుడు కమల్ హాసన్‌పై ఫిర్యాదు చేశారు. చనిపోయిన జలలితకు అవమానం జరిగితే కమల్ హాసన్‌పై కేసు ఎలా నమోదు చేశారన్నదే కదా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి.
 
కమల్ హాసన్ ప్రధాన హోస్ట్‌గా తమిళ బిగ్ బాస్ 2 రియాల్టీ షో విజయవంతంగా ప్రసారమవుతున్న విషయం తెల్సిందే. అయితే, బిగ్‌బాస్ హౌస్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలితను డిక్టేటర్(నియంత)గా సంబోధించి అవమానించారంటూ కమల్‌పై ఫిర్యాదు నమోదైంది. హౌస్‌లోని పోటీదారు ఐశ్వర్య.. జయలలిత డిక్టేటర్‌గా వ్యవహరించి రాష్ట్రాన్ని పాలించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కమల్ హాసన్ వంతపాడారు. 
 
ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మద్రాసు హైకోర్టు అడ్వకేట్ లౌసీల్ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమల్ తన రాజకీయ ప్రయోజనాలకు షోలో జయలలితను అవమానించేలా మాట్లాడుతున్నారని అందులో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అవమానిస్తున్న కమల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయలలితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా చెబుతున్న షో రేపు ప్రసారంకానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు