మహానటికి తర్వాత జయలలిత బయోపిక్ వచ్చేస్తోంది..

గురువారం, 16 ఆగస్టు 2018 (10:39 IST)
అలనాటి తార సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ''మహానటి'' తెరకెక్కింది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన నేపథ్యంలో.. టాలీవుడ్‌లో ఎవర్ గ్రీన్ నటుడు నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ''ఎన్టీఆర్'' బయోపిక్‌ను తెరకెక్కిస్తునారు. ఇప్పటికే ఎన్టీఆర్ గెటప్‌లో వున్న బాలయ్య ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
మరోవైపు తెలుగులో జానపద కథానాయకుడు కాంతారావు బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలవగా, ఇప్పటికే బాలీవుడ్ శృంగార తార సన్నిలియోన్ జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ తెరకెక్కింది. మరోవైపు షకీలా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ నటి రిచా చద్ద ప్రధాన పాత్రలో ఒక బయోపిక్ తెరకెక్కబోతుంది. ఇలా వరుసగా బయోపిక్ సినిమాలు రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో.. తాజాగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథ తెరకెక్కనున్నట్లు తెలిసింది. 
 
కోలీవుడ్ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను విబ్రి మీడియా పతాకంపై విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. విష్ణు వర్ధన్ ఇందూరి ప్రస్తుతం ''ఎన్టీఆర్'' బయోపిక్‌తో పాటు హిందీలో కపిల్ దేవ్ బయోపిక్ ''83''ను నిర్మించడం విశేషం. 
 
ఇక జయలలిత బయోపిక్ మూవీని వచ్చే ఏడాది.. ఆమె జయంతి రోజైన ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. మరి జయలలిత బయోపిక్‌లో ఎవరెవరు నటిస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు