చిరంజీవి, నాగార్జున లాబీయింగ్ చేసుకుని మాకు అన్యాయం చేశారు

శుక్రవారం, 27 నవంబరు 2020 (15:54 IST)
చిరంజీవి, నాగార్జున లాబీయింగ్ చేసుకుని మాకు అన్యాయం చేశారంటూ తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి విమర్శించారు. ఆయన మాటల్లోనే.. మాసినిమా పెద్దలకి, తెలంగాణ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీకి వరాల జల్లు కురిపించారు అని చంకలు కొట్టుకుంటున్నారు.
 
చూస్తుంటే పెద్ద లాబీయింగ్ జరిగినట్లు ఉంది. పెద్ద హీరోలకి లీజు థియేటర్స్ వాళ్లకి వారికి కావాల్సింది వాళ్ళు చేసుకున్నారు. 10 కోట్ల లోపు సినిమాకి జీఎస్టీ వాపస్ అన్నారు. పది కోట్ల సినిమాని చిన్న సినిమా అంటారా. చిన్న సినిమా అంటే రెండు నుంచి మూడు కోట్ల లోపు సినిమాలనే చిన్న సినిమా అంటారు. ఈ చిన్న సినిమాలకి జిఎస్టి నెంబరే వుండదు. సినిమాకి ఎంత లెక్క చూపిస్తామో మనందరికీ తెలుసు.
 
సంవత్సరంలో వచ్చే 200 సినిమాల్లో పెద్ద సినిమాలు, బడ్జెట్ సినిమాలు మహా అంటే 20 నుంచి 30 వరకు మాత్రమే. మిగిలిన 170 నుంచి 180 సినిమాలు చిన్న సినిమాలు. ఇండస్ట్రీకి కొత్త టెక్నీషియన్స్‌ని, కొత్త ఆర్టిస్ట్‌ని తీసుకు వచ్చేది, సామాజిక స్పృహ ఉన్న చిత్రాలని తీసేది ఈ చిన్న నిర్మాతలే. 30 వేల కార్మికులకు పని ఇచ్చి కాపాడేది ఈ 180 చిత్రాల నిర్మాతలే. అలాంటి చిన్న సినిమాలు తీసే నిర్మాతల నోట్లో మట్టి కొట్టారు.
చిన్న చిత్రాల నిర్మాతలు మేము అడిగినవి మూడే మూడు. థియేటర్స్‌లో 2 గంటల షో కంపల్సరీ చిన్న సినిమా ప్రదర్శనకి అడిగాము. ఫ్రీ లొకేషన్స్ ఇవ్వమని అడిగాను. థియేటర్స్‌లో సినిమా ప్రదర్శన కోసం డిజిటల్ ప్రొవైడర్స్  అన్యాయంగా వారానికి 12, 000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దానిని పరిష్కరించమన్నాం. చిన్న చిత్ర నిర్మాతలడిగిన వీటిని పక్కన పడేశారు.
 
చిరంజీవి గారికి, నాగార్జున గారికి చిన్న నిర్మాతలు కనిపించడం లేదు. ఇండస్ట్రీ అంటే మీ ఇరవై సినిమాలు కాదు సార్. 180 సినిమాలు ఉన్నాయి. ఆ 180 నిర్మాతల శాపనార్థాలు మీరు తగిలించుకోకండి సార్. ఇండస్ట్రీ పెద్దలుగా వెళ్లి సంవత్సరంలో 180 చిత్రాలను తీస్తున్న చిన్న చిత్ర నిర్మాతలకి చాలా అన్యాయం చేశారు సార్. మీకు కావలసినవి మీరు లాబీయింగ్ చేసుకుంటున్నారు. థ్యాంక్స్ సార్ అంటూ తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు