'అతిలోకసుందరి' శ్రీదేవికి మరణం లేదు.. 'జగదేకవీరుడు' చిరంజీవి (వీడియో)

ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (13:37 IST)
చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన తొలి చిత్రం "రాణికాసుల రంగమ్మ". ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించారు. వీటిలో "జగదేకవీరుడు - అతిలోకసుందరి" చిత్రం ఓ అద్భుత కావ్యం. ఈ చిత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పిన విషయం తెల్సిందే. అయితే, దివి నుంచి భువి దిగివచ్చిన అందాల తార శ్రీదేవి దివికేగిన విషయంపై జగదేకవీరుడు, మెగాస్టార్ చిరంజీవి తనదైనశైలిలో స్పందించారు. 
 
"శ్రీదేవి చనిపోలేదు. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి చిరస్థాయిగా నిలిచే ఉంటుంది. ఇలాంటి ఓ సందర్భం వస్తుందని కానీ.. ఆ సందర్భంగా ఇలా మాట్లాడాల్సి వస్తుందని కానీ నేనెప్పుడూ ఊహించలేదు. శ్రీదేవికి మరణం లేదు. సినిమా ప్రపంచం ఉన్నంత వరకూ జీవించే ఉంటుంది. అందం అభినయం కలబోసిన నటి శ్రీదేవి. అలాంటి నటి అంతకు ముందు లేరు. ఇక భవిష్యతులో కూడా వస్తారని నేననుకోను. మా అతిలోక సుందరి ఈ రకంగా అనంత లోకాలకు వెళ్లిపోయారంటే... అది మింగుడు పడని చేదు నిజం అంటూ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, ఇంత చిన్న వయసులో శ్రీదేవి ఈ రకంగా హఠాన్మరణం పాలవడం అనేది నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాను. తనకు చిన్నప్పటి నుంచి నటన తప్ప మరొకటి తెలియదు. శ్రీదేవిలోని అంకిత భావం చూసి నేనెంతో నేర్చుకున్నాను. తనతో నేను ప్రారంభంలో 'రాణి కాసుల రంగమ్మ' అనే సినిమా చేశాను. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసినా మా కాంబినేషన్‌లో వచ్చిన అత్యద్భుత దృశ్య కావ్యం 'జగదేకవీరుడు - అతిలోక సుందరి'. అందులో దేవత పాత్రలో ఎంతగా ఒదిగిపోయిందంటే ఆ పాత్ర కోసమే ఆమె పుట్టిందా? లేదంటే ఆమె కోసమే ఆ పాత్ర సృష్టించబడిందా? 
 
అన్నట్టుగా అనిపించింది. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం చివరి చిత్ర "ఎస్పీ పరుశురాం". శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. కోట్లాది ప్రజల గుండెల్లో శ్రీదేవి జీవించే ఉంటారు. ఆమెకు మరణం లేదు. ఈ సినిమా ప్రపంచం ఉన్నంత వరకూ మా శ్రీదేవి బతికే ఉంటుంది" అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు