కమెడియన్ శ్రీనివాస రెడ్డి కొత్త అవతారం?

గురువారం, 16 మే 2019 (17:19 IST)
టాలీవుడ్‌కి కమెడియన్‌లుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోలుగా, విలన్‌లుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా చేసేసి తిరిగి తిరిగి మళ్లీ కమెడియన్‌గా స్థిరపడిపోయిన చాలా మందిని చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఈ కోవలోనే మరో కమెడియన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. కాకపోతే ఈయన తెర ముందు నుండి తెరవెనుకకు వెళ్లనున్నాడట.
 
వివరాలలోకి వెళ్తే... తన అద్భుతమైన టైమింగ్‌తో టాలీవుడ్‌లో బ్రహ్మానందం తర్వాత అంతటి టాప్ కమెడియన్‌గా ఎదిగిన శ్రీనివాస రెడ్డి... తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 
 
అయితే, శ్రీనివాస రెడ్డి త్వరలోనే తనలోని మరో ప్రతిభను వెలికి తీయనున్నాడనే టాక్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఊపందుకొంది. టాలీవుడ్‌లోని ఈ తరం కమెడియన్‌లందరూ కలిసి నిర్వహిస్తున్న 'ఫ్లయింగ్ కలర్స్' అనే గ్రూప్‌లోని సభ్యులందరూ కలిసి అదే పేరుతో ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థ ద్వారా 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' అనే టైటిల్‌తో ఒక సినిమా నిర్మిస్తున్నారని సమాచారం.
 
కాగా... ఆ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత శ్రీనివాస రెడ్డికి అప్పగించారట. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ అయిపోయిందని చిత్ర యూనిట్ చెప్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం నుంచి ఈ తరం కమెడియన్‌లందరూ నటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందనీ... కమెడియన్లందరూ నిర్మించి, నటించిన సినిమా కాబట్టి మంచి హైపే రావచ్చునని కూడా భావిస్తున్నారట.మొత్తం మీద కమెడియన్‌గా స్థిరపడిన శ్రీనివాస రెడ్డి కాస్తా తనలోని దర్శకత్వ ప్రతిభను వెలికితీసే పనిలో ఉన్నాడు... చూద్దాం ఎంత మేరకు విజయం సాధిస్తాడో. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు