మైసిరెడ్డిపల్లిలో అదృశ్యమైన అమ్మాయిని కూడా చంపేసిన సైకో శ్రీనివాస్ రెడ్డి

మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:04 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మైసిరెడ్డిపల్లిలో నాలుగేళ్ళ క్రితం అదృశ్యమైన అమ్మాయి కూడా హత్యకు గురైంది. దీన్నికూడా సైకో శ్రీనివాస్ రెడ్డే చేశాడని పోలీసులు వెల్లడించారు.  
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నాలుగేళ్ళ క్రితం బొమ్మలరామారం సమీపంలోని మైసిరెడ్డిపల్లిలో కల్పన అనే యువతి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఈ అమ్మాయిని కూడా సైకో శ్రీనివాస్ రెడ్డే రేప్ చేసి హత్య చేశాడని రాచకొండ పోలీసు వర్గాలు తేల్చాయి. 
 
రెండు రోజుల నుంచి శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు, ఇప్పటికే శ్రావణి, మనీషా అనే ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు తేల్చారు. నాలుగేళ్ల నాడు కనిపించకుండాపోయిన కల్పన విషయంలోనూ ఇతని ప్రమేయం ఉండవచ్చని భావించి, ఆ దిశగా విచారణ చేసిన పోలీసులు నిజాన్ని కక్కించారు. 
 
ఈ విషయం గ్రామంలో తెలియగానే ప్రజలు బీభత్సం సృష్టించారు. కల్పన అదృశ్యమైనట్టు అప్పుడే ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోలేదని, కల్పన మృతికి అప్పటి బొమ్మలరామారం ఎస్ఐ, యాదగిరిగుట్ట సీఐ కారణమంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తాము ముగ్గురు బిడ్డలను కోల్పోయామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు