అనుకున్న బడ్జెట్‌కు పైసా తగ్గినా సినిమా తీయను : డైరెక్టర్ శంకర్

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (21:10 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం 'భారతీయుడు'. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. పైగా, ఆకాలంలో ఇది ఓ సంచలనం. అవినీతిపరులపై విసిగివేసారిపోయిన ఓ స్వాతంత్ర్య సమరవీరుడు తనదైనశైలిలో చేసిన పోరాటంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుని భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో దర్శకుడు శంకర్ ఇమేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. 
 
ఆ తర్వాత ఇన్నాళ్లకు ఈ చిత్రాన్ని సీక్వెల్ చేసేందుకు దర్శకుడు శంకర్ ప్లాన్ చేశారు. ఇందులో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ లాక్డౌన్‌కి ముందు చాలావరకు జరిగింది. అదేసమయంలో షూటింగ్ సెట్లో భారీ క్రేన్ ఒకటి విరిగిపడటంతో ముగ్గురు యూనిట్ సభ్యులు మరణించారు. వీరిలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉన్నారు. దీంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత లాక్డౌన్ రావడంతో ఆరు నెలల నుంచీ షూటింగ్ లేదు.
 
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ వ్యయం ఇప్పటికే బాగా పెరిగిపోవడంతో చిత్రం బడ్జెట్టును బాగా తగ్గించమని దర్శకుడిపై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒత్తిడి తెస్తోంది. అయితే, దర్శకుడు మాత్రం క్వాలిటీ విషయంలో రాజీపడే మనిషి కాదు. దాంతో ససేమిరా అన్నాడని, దీంతో సదరు చిత్ర నిర్మాణ సంస్థ తదుపరి షూటింగును ఇంకా ప్రారంభించడం లేదనీ తెలుస్తోంది.
 
శంకర్ ఎన్ని సార్లు అడిగినప్పటికీ, నిర్మాత నుంచి సరైన జవాబు రాకపోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చిందట. దాంతో విసిగిపోయిన దర్శకుడు తాజాగా నిర్మాతకు ఘాటుగా లెటర్ రాసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. షూటింగ్ విషయమై వెంటనే ఏదో ఒకటి తేల్చాలని, ఒకవేళ ఆలస్యమయ్యేలా వుంటే కనుక తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించుకుంటాననీ ఆ లేఖలో దర్శకుడు శంకర్ తేల్చిచెప్పాడట. అయితే, దీనికి ఇంతవరకు నిర్మాత నుంచి రిప్లై లేదనీ, జవాబు కోసం శంకర్ ఎదురుచూస్తున్నాడనీ అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు