గుండెపోటు వల్లే శ్రీదేవి మరణించారు... తేల్చిన ఫోరెన్సిక్ రిపోర్టు

సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:44 IST)
నటి శ్రీదేవి మరణంపై దుబాయ్ ఫోరెన్సిక్ విభాగం నివేదిక ఇచ్చింది. అందాల నటి గుండెపోటు వల్లే చనిపోయారంటూ స్పష్టం చేసింది. శనివారం రాత్రి మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని అప్పగించే ప్రక్రియ ఆలస్యం కావడంతో ఆమె మరణంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. 
 
సహజ మరణమైతే ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందంటూ భారత మీడియాలో వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో శ్రీదేవి గుండెపోటు కారణంగానే చనిపోయారంటూ ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. ఆమెకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మరణానికి సంబంధించి ఎలాంటి అనుమానాలకు తావులేదని తేల్చిచెప్పారు. 
 
అదేసమయంలో శ్రీదేవి భౌతికకాయం తరలింపుకు దుబాయ్ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చినట్టు సమాచారం. జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ ఎవిడెన్స్‌ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి. వైద్యుల రిపోర్టు అనంతరం ఎన్‌వోసీ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
దీంతో భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు దుబాయ్‌ నుంచి శ్రీదేవి పార్థివదేహాన్ని తరలించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అనిల్ అంబానికి చెందిన ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేశారు. శ్రీదేవి పార్థివదేహం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముంబై చేరుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు