కోటి రూపాయలిచ్చినా ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించను... పోసాని

మంగళవారం, 4 జులై 2017 (20:05 IST)
రాంగోపాల్ వర్మ స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ తీస్తారన్న దగ్గర్నుంచి అటు అభిమానులు, ఇటు సెలబ్రిటీలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి బయోపిక్ తీయడం వేస్ట్ అన్నారు. ఎన్టీఆర్ ఎవరెస్ట్ శిఖరం అనీ, అలాంటి ఆయనలో మచ్చలు చూపించే ప్రయత్నం చేస్తే ఆయన అభిమానులు, ప్రజలు చెప్పులతో కొడతారని హెచ్చిరంచారు. అంతేకాకుండా అసలు ఆ సబ్జెక్టును టచ్ చేయకపోవడమే బెటర్ అని సూచన చేశారు.
 
ఒకవేళ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తూ ఆ చిత్రంలో తనను నటించమని అడిగితే రోజుకి కోటి రూపాయలిచ్చినా అందులో చచ్చినా నటించనన్నారు. అసలు బయోపిక్ అంటే ఆయన జీవితమంతా తీయాలి. అవన్నీ తీసే సాహసం వర్మకు వుందా అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రాకముందు వరకూ తీసుకుంటే ఫర్వాలేదు కానీ ఆ తర్వాత తీస్తే చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వుంటుందన్నారు. 
 
వెన్నుపోటు ఎవరు పొడిచారో చూపిస్తారా? హోటల్ వైస్రాయ్ వద్ద చెప్పులు ఎవరు వేశారో చెప్తారా? లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ ప్రేమించి ప్రేమించి పెళ్లి ఎందుకు చేసుకున్నారో చెప్పగలరా? ఇవే కాదు ఇలాంటి ప్రశ్నలు చాలానే వున్నాయి. అందుకే ఎవరికైనా ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనే ఆలోచనలుంటే మానుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి