వాడు నా మాట వినకుండా వెళ్లిపోయాడు... ఇళయరాజా : చివరి పాట అదే...

శనివారం, 26 సెప్టెంబరు 2020 (08:24 IST)
సినీ ఇండస్ట్రీలో ఇద్దరు లెజెండ్లు ఇళయరాజా. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. వీరిద్దరూ బాల్య స్నేహితులు. వీరిద్దరి మధ్య ఒరే.. తరే అనేటువంటి సాన్నిహిత్యం వుంది. అలాంటి స్నేహితుల్లో ఒకరు ఇపుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన లెజెండ్ సింగర్ ఎస్.పి. బాలు.
 
ఇక బాలు మృతిపై అతని బాల్య స్నేహితుడు ఇళయరాజా కన్నీటిపర్యంతమయ్యారు. బాలుకి కరోనా అని తెలియగానే ఇళయరాజా తల్లడిల్లిపోయారు. 'బాలూ నీకోసం నేను ఎదురు చూస్తుంటా. తొందరగా వచ్చేయ్' అంటూ ఓ వీడియో ద్వారా తన బాధను ఇళయరాజా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇపుడు బాలు ఇక లేరన్న వార్తను ఇళయరాజా జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
'బాలూ నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని చెప్పాను.. కానీ నా మాట వినకుండా వెళ్లిపోయావు' అని ఇళయరాజా ఆవేదన వ్యక్తం చేశారు. నీవు ఎక్కడకు వెళ్లావు? ఎందుకు వెళ్లావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా? అని నిలదీశారు. తనకు మాటలు రావడం లేదని... ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని... ప్రపంచంలో దేన్నీ చూడలేనని అన్నారు. ఎంతటి దుఃఖానికైనా ఓ హద్దు ఉంటుందని... కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదని చెప్పారు.
 
ఇదిలావుంటే, దేశంలోని పలు భాషల్లో దాదాపు 40 వేల పాటలను పాడిన ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శుక్రవారం మధ్యాహ్నం కానరాని లోకాలకు వెళ్లిపోగా, దక్షిణాది చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజ గాయకుడిని కోల్పోయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరెవరికీ సాధ్యంకాని చరిత్రను సృష్టించిన మన బాలూ సినిమాకు పాడిన చివరి పాట ఏంటో తెలుసా?
 
'పలాస 1978' సినిమా కోసం రఘు కుంచె స్వరపరిచిన 'ఓ సొగసరి...' అంటూ సాగే పాటను ఆయన పాడారు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న రఘు, అంతటి మహానుభావుడితో పాట పాడించడం తన అదృష్టమన్నారు. ఎస్పీబీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, మనం ఓ గొప్ప గాయకుడిని కోల్పోయామని కన్నీరు పెట్టుకున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు