జై లవకుశ: రెండో హీరోయిన్‌గా నివేదా థామస్.. పోస్టర్ రిలీజ్.. మూడో హీరోయిన్ ఎవరు?

బుధవారం, 12 ఏప్రియల్ 2017 (14:26 IST)
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై లవకుశ అనే పేరును కూడా ఖరారు చేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇందులో ఒక పాత్ర పేరు లవకుమార్, మరో పాత్ర పేరు జై అని తెలుస్తుండగా మూడో పాత్రకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది. ఆ మధ్య పోస్టర్‌తో మొదటి హీరోయిన్ రాఖి ఖన్నా అని ఖరారు చేసిన సినీ యూనిట్.. తాజాగా రెండో హీరోయిన్ నివేదా థామస్ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ కన్ఫామ్ చేసింది. 
 
నాని నటించిన జెంటిల్మెన్ చిత్రంతో నివేదా థామస్ తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని నటించే మరో చిత్రం నిన్ను కోరిలోనూ నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇప్పటికే శ్రీరామనవమి సందర్భంగా జై లవకుశ మోషన్ పోస్టర్ విడుదలైంది. 
 
ఈ పోస్టరుకు మంచి ఆదరణ లభించింది. ఇక మూడో హీరోయిన్ ఎవరనే దానిపై సోషల్ మీడియాతో పాటు ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ చిత్రం ఆగస్టు రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు యూనిట్ సర్వం సిద్ధం చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి