వీఐపీ రీమేక్ ఆర్టిస్ట్ పద్మావతి సెట్లోనే మృతి.. భవనం వద్ద దొరికిన మృతదేహం.. ఏమైంది?

మంగళవారం, 10 జనవరి 2017 (17:28 IST)
ధనుష్‌ తమిళ చిత్రం 'వీఐపీ'కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న కన్నడ జూనియర్ ఆర్టిస్ట్ పద్మావతి (44) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈమె అనుమానాస్పదస్థితిలో సెట్స్‌లోనే ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. యలహంక సమీపంలోని ఓ భవనంలో సోమవారం సాయంత్రం షూటింగ్‌ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
దాదాపు 120 మంది బృందంతో వీఐపీ సినిమాను కన్నడ రీమేక్ షూటింగ్‌ యలహంకలో జరుగుతుండగా... సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ప్యాకప్ సమయంలో పద్మావతి సెట్లో లేదని యూనిట్ గుర్తించింది. వెంటనే ఆమెకోసం వెతకడంతో నిర్మాణంలో ఉన్న మరో భవనం వద్ద ఆమె మృతదేహం దొరికింది. ఆమె మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం యలహంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
పద్మావతి కనిపించలేదని రాత్రి 9 గంటలకు తమకు సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దర్శకుడిని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ఇంకా పద్మావతి మృతి పట్ల అనుమానాలున్నాయని స్నేహితులు అంటున్నారు. అయితే నిర్మితమవుతున్న భవనం ఎనిమిదో అంతస్తు నుంచి ఆమె కిందపడిపోయి మరణించినట్లు యూనిట్ చర్చించుకుంటోంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి