నా అతిపెద్ద శక్తివి నీవే నాన్నా.. నా స్థాయిని చూసి గర్విస్తున్నా : రెబెల్ స్టార్

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (13:56 IST)
టాలీవుడ్ నుంచి ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన హీరో ప్రభాస్ తన 41వ పుట్టినరోజు వేడుకలను అక్టోబరు 23వ తేదీ శుక్రవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిలో ప్రభాస్ పెదన్నాన్న, సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు కూడా తన బిడ్డకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
 
"నా అతి పెద్ద శక్తికి, బలానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వృత్తి పట్ల నీకున్న నిబద్ధతే నీకు అనితర సాధ్యమైన విజయాలను తీసుకొచ్చింది. నీవు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎదిగిన తీరును చూసి ఎంతో గర్విస్తున్నా. ఈ రోజు నీవున్న స్థాయిని చూసి గర్వపడటం కన్నా నాకు మరేదీ సంతోషాన్ని ఇవ్వలేదు. సరిహద్దులను దాటి, నీవు మరెన్నో రికార్డులను బద్దలుకొట్టాలి. నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి" అంటూ కృష్ణంరాజు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
అలాగే, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తన శుభాకాంక్షలు తెలిపారు. 'సైరా' షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్‌తో దిగిన ఫోటోని షేర్ చేసిన చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియజేస్తూ.. "డియ‌ర్ ప్ర‌భాస్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను. ఈ ఏడాది నుండి అద్భుత‌మైన సినిమాల లైన‌ప్ బాగుండాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు. 
 
కాగా, 'సైరా న‌ర‌సింహారెడ్డి' అనే పీరియాడిక‌ల్ చిత్రం చేయ‌డానికి ప్ర‌భాస్ న‌టించిన "బాహుబ‌లి" కార‌ణం అని చిరు ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు