తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సతీమణి, వైకాపా లీడర్ లక్ష్మీ పార్వతి ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సెటైర్లు విసిరారు. రామ్ గోపాల్ వర్మ జీనియస్ అంటూ పొగుడుతూనే.. దారి తప్పాడంటూ ఏకిపారేశారు.
ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన సినిమాలను లక్ష్మీ పార్వతీ ఎత్తిచూపుతూ.. అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్న నవ సమాజాన్ని.. దెయ్యాలతో భయపెడుతున్నారని సెటైర్లు విసిరారు. ఆయనే కనుక తన జీనియస్ మైండ్తో సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఆయన్ని దారి తప్పిన మేధావి అన్నానని లక్ష్మీ పార్వతి అన్నారు.
అంతేగాకుండా బీజేపీ నేత, సీనియర్ రాజకీయ వేత్త సుబ్రహ్మణ్య స్వామిది కూడా అదే రూటేనని.. ఆయన కూడా దారి తప్పిన మేధావి అని లక్ష్మీ పార్వతి చెప్పారు. ఆయనకు అనేక సబ్జెక్టుల్లో మంచి పరిజ్ఞానం ఉందని.. అయితే అనవసరమైన విషయాల కోసం ఆయన తెలివితేటలను ఉపయోగించుకుంటూ దారితప్పారని అభిప్రాయపడ్డారు.