హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల ధాటికి ఇప్పటికే 75 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వంద మంది వరకు గల్లంతయ్యారు. అయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి మండీ లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి.
తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరగా, తనకేం అధికారిక కేబినెట్ లేదంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్లో రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు 78 మంది మరణించగా, ఒక్క మండీ జిల్లాలోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తన నియోజకవర్గమైన మండీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమె, బాధితుల పట్ల సున్నితత్వం లేకుండా మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది.
ఆదివారం వరద బాధితులతో మాట్లాడుతూ, "విపత్తు సహాయక చర్యలు చేపట్టడానికి నాకేం అధికారిక కేబినెట్ లేదు. నాతో పాటు నా ఇద్దరు సోదరులు ఉన్నారు, ఇదే నా మంత్రివర్గం. ఎంపీగా నా పని పార్లమెంటుకు పరిమితం. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడమే నా బాధ్యత" అని నవ్వుతూ అన్నారు.
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలు సర్వం కోల్పోయి బాధలో ఉంటే, మండీ ఎంపీ నవ్వుతూ ఎగతాళిగా మాట్లాడటం దారుణమని విమర్శించింది. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "కొంతైనా సున్నితత్వం చూపించండి కంగనా జీ" అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే మండిపడ్డారు.