సత్య హరిశ్చంద్రగా రంగస్థల నటి మంగాదేవి

శనివారం, 12 నవంబరు 2016 (17:07 IST)
'సత్య హరిశ్చంద్ర' నాటకం తాజాగా సినిమాగా మారనుంది. రంగస్థల నటి మంగాదేవి ఇందులో సత్యహరిశ్చంద్ర పాత్రలో నటించడం విశేషం. మోరల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రంగస్థల నటుడు వై.గోపాలరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొత్తపల్లి సీతారాము నిర్మిస్తున్నారు. వీణాపాణి శ్రీనివాస్‌ సంగీతాన్నందించిన ఆడియో శనివారంనాడు హైదరాబాద్‌లో విడుదలైంది. ఆడియో సీడీని లక్ష్మీపార్వతి ఆవిష్కరించారు.
 
అనంతరం మంగాదేవి మాట్లాడుత... నేను ఈ పాత్ర చేయాలన్నది నాన్నగారి కోరిక. ఆయన ప్రోత్సాహంతోనే చిన్నప్పుడు నాటకాల్లో చేరాను. పద్యాలు పాడటం నేర్చుకున్నాను. హరిశ్చంద్ర పాత్రను అత్యధికసార్లు ప్రదర్శించాను. ఇప్పుడు ఈ నాటకం పూర్తిస్థాయి సినిమాగా రావడం ఆనందంగా వుందని' అన్నారు.
 
నిర్మాత తెలుపుతూ... మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక నాటకాలు. ఆదరణ కోల్పోతున్న ఈ రంగాన్ని కాపాడుకోవాలనే చేస్తున్న ప్రయత్నమిది. నాటకంలో చూపించినట్లే సత్యం పలకాలి, నిజాయితీగా వుంటే సమాజంలో హింస జరగదని' అన్నారు. నటుడు జె.పి. మాట్లాడుతూ.. పద్యాలు మన తెలుగుజాతి సంపద. నాన్నగారు నాటకాల్లో పద్యాలు పాడేవారు. ఒకప్పుడు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము వరకు పద్యనాటక ప్రదర్శనలు జరుగుతుండేవి. ప్రస్తుతం వాటిని నిడివి రెండున్నర గంటలకే తగ్గిపోయింది. కళను కాపాడుకునే ఇలాంటి ప్రయత్నాలు నిరంతరం సాగాలి' అన్నారు. దర్శకుడు వై.గోపాలరావు మాట్లాడుతూ.. డిసెంబర్‌లో ఈసినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి