హీరోయిన్ల పరువు తీయడమే ఎన్సీబీ ఉద్యోగమా? కంగనాను ప్రశ్నించరా? నగ్మా ప్రశ్న

గురువారం, 24 సెప్టెంబరు 2020 (11:49 IST)
సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా మండిపడ్డారు. ముంబై డ్రగ్స్ దందాలో పలువురు హీరోయిన్లకు మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో-ఎన్.సి.బి) బుధవారం సమన్లు జారీచేసింది. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సాప్ చాటింగ్‌ను ఆధారంగా చేసుకుని ఏవిధంగా సమన్లు పంపిస్తారంటూ ప్రశ్నించారు. పైగా, డ్రగ్స్ సేవించినట్టు బహిరంగంగా ప్రకటించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఎందుకు ప్రశ్నించరంటూ నిలదీశారు. హీరోయిన్ల పరువు తీయడమే ఎన్.సి.బి ఉద్యోగమా అంటూ ప్రశ్నించారు. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడడంతో దీనిపై ఎన్.సి.బి విచారణ జరుపుతోంది. ఈ విచారణలో అనేక సినీ సెలెబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో తాజాగా నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ సమన్లు జారీచేసింది. విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. 
 
దీనిపై కాంగ్రెస్ మహిళా నేత నగ్మా ప్రశ్నల వర్షం కురిపించింది. ఒకప్పుడు తాను డ్రగ్స్‌ వాడానంటూ హీరోయిన్‌ కంగనా రనౌత్ చెప్పినప్పటికీ ఆమెకు అధికారులు సమన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం వాట్సప్‌ మెసేజ్‌ల ఆధారంగా హీరోయిన్లకు సమన్లు ఇచ్చారని, మరి బహిరంగంగా అంగీకరించిన కంగనా రనౌత్‌కు మాత్రం ఎందుకు సమన్లు పంపలేదని ఆమె నిలదీశారు.
 
డ్రగ్స్‌కు సంబంధించి సెలబ్రిటీల సమాచారాన్ని మీడియాకు అందచేసి ప్రజల్లో వారి పరువు తీయడమే ఎన్సీబీ అధికారుల ఉద్యోగమా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది నిజంగా విచారకరమైన విషయమని చెప్పుకొచ్చింది. 
 
కాగా, గతంలో కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ఇటీవల వైరల్ అయింది. నటనలో ఆసక్తి ఉండడంతో తాను టీనేజ్‌లో ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చానని, డ్రగ్స్‌కి కూడా బానిసను అయ్యానని, సినీ ఛాన్సుల కోసం ఒక హీరోతో ఓ రాత్రి కూడా గడిపినట్టు తెలిపింది. అయితే, ప్రస్తుతం డ్రగ్స్‌ తీసుకునేవారితో తనకి ఎలాంటి సంబంధాల్లేవని ఇటీవలే కంగనా రనౌత్ ట్వీట్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు