మరో రీమేక్‌కు పవన్ సన్నాహాలు.. బాధ్యత త్రివిక్రమ్‌కే...

గురువారం, 3 మార్చి 2022 (19:32 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రిమేక్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టు బాధ్యతలను కూడా తన ప్రాణమిత్రుడు, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్టు సమాచారం.
 
ఇటీవల పవన్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన "భీమ్లా నాయక్" చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్ర నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలకపాత్రను పోషించారు. మాటలు రాశారు. స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా అంతా త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే కొనసాగింది. అందువల్లే త్రివిక్రమ్ లేకుంటే 'భీమ్లా నాయక్' చిత్రం లేదని ప్రిరిలీజ్ ఈవెంట్‌లో పవన్ వేదికపై నుంచి వెల్లడించారు. 
 
ఇక ఇపుడు మరో రిమేక్ చిత్రంలో నటించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన "వినోదయ సిత్తం" అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని పవన్ తెలుగులో సముద్రఖని దర్శకత్వంలోనే ఆ సనిమాను రీమేక్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్ కీలక పాత్రను పోషించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు