పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రం నుంచి హోళీ పండుగ సందర్భంగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో ఈ చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ తాజా పోస్టరులో పవన్తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ పవన్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇంతకుముందు మార్చి 28వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇపుడు ఆ తేదీని మార్చారు. విడుదల తేదీని మే నెల 9వ తేదీకి వాయిదా వేశారు.
ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడిలు దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 17వ శతాబ్దంలో సాగే కథ నేపథ్యంలో రెండు భాగాలుగా తీస్తున్నారు. నిధి అగర్వాల్తో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేరా, సునీల్ తదితరులు నటిస్తున్నారు.