'బాహుబలి' మనసున్న మారాజు : పీఎం సహాయ నిధికి రూ.3 కోట్లు

శుక్రవారం, 27 మార్చి 2020 (08:21 IST)
టాలీవుడ్ అగ్రహీరోల్లో 'బాహుబలి' ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమాని సెల్ఫ్ క్వారంటైన్‌లో గడుపుతున్నారు. ఇటీవలే తన కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం యూరప్‌కు వెళ్లి వచ్చారు. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయితే, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో కరోనా బాధితుల సహాయార్థం అనేక మంది ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది హీరోలు తమ వంతు సాయాన్ని ప్రకటించారు. టాలీవుడ్ ప్రముఖులైన మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌, దిల్‌రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి వారు తమ వంతు సాయం ప్రకటించారు. 
 
ఈ క్రమంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రభాస్ రెండుసార్లు సాయం ప్రకటించడం గమనార్హం. తాజాగా ప్రధానమంత్రి సహాయనిధికి మూడు కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. దీంతో అతడు ప్రకటించిన విరాళం మొత్తం నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రభాస్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
కాగా, ప్రస్తుతం దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు