యలహంక అపార్ట్‌మెంట్‌ను విక్రయానికి పెట్టిన కన్నడ నటి!

బుధవారం, 16 సెప్టెంబరు 2020 (11:29 IST)
తాను ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న యలహంక అపార్ట్‌మెంట్‌ను కన్నడ నటి రాగిణి ద్వివేది అమ్మకానికి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తొలుత అరెస్టు అయింది కూడా రాగిణి ద్వివేదినే.
 
ప్రస్తుతం జైల్లో ఉన్న రాగిణి... ఆదాయ పన్ను శాఖ అంటే జడుసుకుంటున్నారట. ఐటీ దాడులు, జప్తుల భయంతో తన ఆస్తులను అమ్మకానికి పెట్టినట్టు ఆ కథనాలను బట్టి తెలుస్తోంది. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న యలహంకలోని అపార్ట్‌మెంట్‌ను కూడా విక్రయానికి ఉంచినట్టు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
అయితే, ఆమె ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదట. ఇప్పటికే డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఆమె ఆస్తులను కొనుగోలు చేసి చిక్కుల్లో పడటం ఎందుకున్న భావనతోనే ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం.
 
కాగా, రాగిణి బీజేపీలో చేరబోతున్నట్టు కూడా పుకార్లు గుప్పుమన్నాయి. షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన ఆమె అక్కడ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్‌రావుతో భేటీ అయ్యారు. 
 
తాను పదవుల కోసం పార్టీలో చేరడం లేదని, సామాన్య కార్యకర్తగానే ఉంటానని ఈ సందర్భంగా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలో ఆమె చేరికకు లైన్ క్లియర్ అయిన సమయంలోనే డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అరెస్టు కావడంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసినట్టు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు