మాస్ మహారాజా రవితేజ హీరోగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు సమర్పణలో 'పటాస్', 'సుప్రీమ్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'రాజా ది గ్రేట్'. 'వెల్కమ్ టు మై వరల్డ్' ఉప శీర్షిక. సోమవారం హైదరాబాద్లో ఈ సినిమా లాంచనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రవితేజ, మెహరీన్లపై ముహుర్తపు సన్నివేశానికి హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ క్లాప్ కొట్టగా, ప్రముఖ ఫైనాన్సియర్ ఎం.వి.ఆర్.ఎస్.ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... 'రవితేజతో చేస్తున్న విభిన్న కాన్సెప్ట్ మూవీ. ఇప్పటివరకు రవితేజగారు చేయని విలక్షణమైన పాత్రలో కనపడతారు. అలాగే దిల్రాజు బ్యానర్లో రెండో సినిమా చేయడం ఆనందంగా ఉంది. రవితేజ అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తాం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తాం' అన్నారు.