వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చాడు. తన తదుపరి సినిమా పేరు ‘శశికళ’ అని గతంలో ప్రకటించాడు. శశికళ అనే పేరుతో ఓ ఫిక్షనల్ డ్రామాను తెరకెక్కించనున్నానని, ఓ రాజకీయ నాయకురాలి ప్రియ స్నేహితురాలి జీవితం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ట్విట్టర్లో వర్మ తెలిపాడు. ఈ పేరును ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్టు చెప్పాడు. తనకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే చాలా గౌరవమని… శశికళ అంటే అంతకుమించిన గౌరవమని చెప్పాడు.
ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఈసారి తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ తననే ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పిందని పన్నీర్ సెల్వం తన మనసులోని మాటలను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఉద్దేశించి వర్మ ట్వీట్ చేశారు. తమిళనాడులో ఓపీఎస్ (ఓ పన్నీర్ సెల్వం) జయలలిత ఆత్మ తననే ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పిందనడం.. పొలిటికల్ హారర్ సినిమాను తలపిస్తోందని వర్మ చెప్పాడు. ఇప్పుడు భూతవైద్యుడి పాత్రను మోదీ పోషిస్తారా అంటూ రాంగోపాల్ వర్మ సందేహం వ్యక్తం చేశారు. అయితే ఈ ట్వీట్స్లో మోదీని భూతవైద్యుడితో పోల్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వర్మ చెప్పినట్లు మోదీనే పన్నీరును వెనక నుంచి నడిపిస్తున్నారని కొందరంటుంటే, మరికొందరు మాత్రం మోదీని భూతవైద్యుడితో పోల్చడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరేమనుకున్నా ఇలాంటి ట్వీట్స్ చేయడం వర్మకు కొత్తేమీ కాదు కదా..!