వెన్నులో వణుకు.. గుండెల్లో భయం పుట్టే చట్టాలు రావాలి : రేణు దేశాయ్

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (08:59 IST)
ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే వెన్నులో వణుకు, గుండెల్లో భయం పుట్టే చట్టాలు రావాలని హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ అభిప్రాయపడ్డారు. ఉన్నావో, కథువా ఘటనలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలతో పాటు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
వీటిపై రేణూ దేశాయ్ స్పందిస్తూ, ఇలాంటి దుర్మార్గపు ఘటనలు చూస్తుంటే ఆడపిల్లలుగా పుట్టడమే వీరు చేసిన పాపమనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు. 'అసిఫా, నిర్భయ, ఉన్నావో యువతి... వీళ్ళందరూ వివిధ వయసులకు చెందిన వారు. కులాల రీత్యా గాని ప్రాంతాల రీత్యాగాని వీరికి ఎటువంటి సంబంధం లేదు, కానీ అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బాధితులంతా (వీరంతా) అడపిలల్లే. ఇలాంటి దుర్మార్గపు ఘటనలు చూస్తుంటే ఆడపిల్లలుగా పుట్టడమే వీరు చేసిన పాపం అనిపిస్తోంది. 
 
ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే చర్యలను చేపట్టాలని ప్రముఖ లాయర్లను, ఓ ప్రఖ్యాత సామాజిక సేవా కార్యకర్తను, ఒక పోలీసు ఉన్నతాధికారిని కోరగా, 'ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు, గుండెల్లో భయం పుట్టే విధంగా ఎప్పుడైతే ప్రభుత్వం చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పటిదాకా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ర్యాలీలు నిర్వహించినా ఎటువంటి ఉపయోగం ఉండదని' తేల్చి చెప్పారు.
 
ఆడపిల్లలు, పసిపిల్లలపైన జరుగుతున్న లైంగిక దాడులు, అకృత్యాలు నిత్యం మనం అనేకం చూస్తూనే ఉన్నాం... ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని సోషల్ మీడియాలో, అనేక చర్చా వేదికల్లో, రోడ్లపై ర్యాలీల రూపంలో మన నిరసనను తెలుపుతూనే ఉన్నాం. అయినా ఈ ఘటనలు అగట్లేదు, ఈ చర్యలకు పాల్పడే రాక్షసులలో ఎటువంటి మార్పు రావట్లేదు. 
 
ఎప్పుడైతే ప్రభుత్వం కఠినమైన చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పుడే ఈ హృదయ విదారక ఘటనలకు చరమగీతం పాడచ్చు. అప్పటివరకు మన ఆడపిల్లలను సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.. ఎందుకంటే కన్న తండ్రే తన కూతుళ్లను రేప్ చేసిన చరిత్ర మనకుంది... అందుకే మన ఆడపిల్లలకు తగిన రక్షణ కలిగిస్తూ మనం భద్రంగా కాపాడాల్సిన అవసరం మనకు ఉంది!' అంటూ రేణూ దేశాయ్ స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు