ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేసి గత నాలుగేళ్లుగా ఓ భర్త మరో మహిళతో గుట్టుచప్పుడు కాకుండా సంబంధం కొనసాగిస్తున్నాడు. తన భర్త కోసం ఎంత వెదికినా అతడి ఆచూకి లభించలేదు. చిట్టచివరికి తన భర్త ఎక్కడ వున్నాడో తెలుసుకున్న భార్య అతడి వద్దకెళ్లింది. తన భర్త వేరే మహిళతో గదిలో ఏకాంతంగా వుండటాన్ని చూసి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించి మూకుమ్మడిగా అందరూ అతడిపై దాడి చేసి దేహశుద్ధి చేసారు.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని నార్సింగి పోలీసు స్టేషను పరిధిలో ఈ ఘటన జరిగింది. హైదర్షకోట్ బాలాజీనగర్ కాలనీకి చెందిన వేణు కుమార్, శిరీషలు దంపతులు. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా వున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వేణు కుమార్ వున్నట్లుండి కనిపించకుండా పోయాడు. గత నాలుగేళ్లుగా అతడి ఆచూకి లేదు. ఐతే తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు శిరీషకు సమాచారం అందింది.
దాంతో భర్త ఎక్కడ వున్నాడో తెలుసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ పట్టుకోలేకపోయింది. చివరకి శనివారం నాడు అతడి ఆచూకి వివరాలను పక్కాగా సేకరించి అక్కడికి వెళ్లింది. మరో మహిళతో వున్న భర్తను చితక్కొట్టడమే కాకుండా, భర్తతో వున్న మహిళపై కూడా దాడి చేసారు. పోలీసులు జోక్యం చేసుకుని శిరీష భర్తను, మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.