రాజస్థాన్: మహిళపై మూడు రోజుల పాటు ఎస్సై అత్యాచారం.. భర్తపై ఫిర్యాదు చేస్తే..?

మంగళవారం, 9 మార్చి 2021 (11:07 IST)
రాజస్థాన్‌లో ఓ ఎస్సై పోలీస్ స్టేషన్‌లోనే దారుణానికి తెగబడ్డాడు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై పోలీస్ స్టేషన్‌లో మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అల్వార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. 
 
వివరాల్లోకి వెళితే.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ 2018లో భర్తపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అయితే, ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా, మహిళ భర్త విడాకులకు సిద్ధం కాగా, ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో మహిళ ఈ నెల 2న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని కలిసినట్టు అల్వార్ ఎస్పీ తెలిపారు.
 
ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనపై మధ్య వయసులో ఉన్నఎస్సై మార్చి 2 నుంచి మూడు రోజులపాటు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదుపై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు
 
విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేశామని, నిందితుడు సింగ్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోలీసు కస్టడీలో ఉన్నట్టు చెప్పారు. ఎస్సైకి, బాధిత మహిళకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డును కూడా ఆమె అందించినట్టు తెలిపారు.
 
నిందితుడిని సస్పెండ్ చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఐజీ నుంచి ఆదేశాలు అందినట్టు ఎస్పీ వివరించారు. బాధిత మహిళ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు రికార్డు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు