రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి.. నాకు మగపిల్లాడు పుడితే?: శ్రుతి హాసన్

సోమవారం, 10 జులై 2017 (12:42 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై.. సినీ లెజెండ్ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ పాపులారిటీ కోసం పాకులాడుతున్నాడని కమల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. కమల్ కుమార్తె, హీరోయిన్ శ్రుతిహాసన్ మాత్రం రజనీకాంత్ రాజకీయాల్లో రావాలంటోంది. రజనీ సార్ కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని.. ఆయన రాకతో రాజకీయాలకు కొత్త గౌరవం దక్కుతుందని చెప్పింది. అంతేగాకుండా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా మార్పు సాధ్యమవుతుందని తాను ఆశిస్తున్నట్లు శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది. 
 
అలాగే తాను కమల్ కుమార్తె అయినప్పటికీ.. ఎవరి ఆదరణ లేకుండా నటిగా ఎదిగానని శ్రుతి చెప్పుకొచ్చింది. తన ప్రయత్నంతోనే తాను ఈ స్థాయికి వచ్చానంది. తండ్రి సాధించిన విజయాల్లో తానింకా ఒక శాతం కూడా పూర్తి చేయలేదని తెలిపింది. ప్రస్తుతం మహిళలకు భద్రత లేదని.. ఇందుకు కారణం మనదేశంలో పురుషులకు గౌరవమర్యాదలు అధికమని అభిప్రాయపడింది. కానీ మా ఇంట్లో అలాంటి పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చేసింది. 
 
తనకు మగపిల్లాడు పుడితే.. తప్పకుండా అతనికి మహిళలను ఎలా గౌరవించాలో నేర్పిస్తానని తెలిపింది. తమిళ అమ్మాయిగా పుట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని.. అలాగే ముంబైలో తమిళనాడు, కేరళ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలను కలిపి.. "మదరాసి'' అంటారని.. అయితే వారికి క్లాస్ తీసుకుంటానని చెప్పింది. తమిళనాడు గురించి ఎవరైనా హేళన చేస్తే అస్సలు వదిలిపెట్టనని శ్రుతిహాసన్ వెల్లడించింది. సమయం లేకపోవడంతో తన తండ్రి యాంకర్‌గా వ్యవహరించే బిగ్ బాగ్ కార్యక్రమాన్ని చూడలేకపోతున్నానని.. త్వరలోనే ఎలాగైనా ఆ షోను చూస్తానని శ్రుతిహాసన్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి