రామ్‌ను అందుకే పెళ్లి చేసుకున్నాను.. అసలు విషయం చెప్పిన సునీత

సోమవారం, 23 ఆగస్టు 2021 (15:45 IST)
సింగర్ సునీత రెండో పెళ్లి గురించి తెలిసిందే. మ్యాంగో అధినేత రామ్ వీరపనేనితో రెండోసారి ఏడడుగులు వేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ కొనసాగింది. పెళ్లి తర్వాత గప్ చుప్‌గా ఉండదలుచుకోలేదు సునీత. సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. తన ప్రొఫెషనల్‌, పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి గురించి ఆమె మాట్లాడింది. 
 
తాను కూడా అందరు ఆడపిల్లల్లాగనే చక్కటి జీవితాన్ని ఊహించుకున్నట్టు చెప్పారు. పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలని, చక్కగా చూసుకునే వ్యక్తి తన జీవితంలోకి రావాలని కోరుకున్నట్టు తెలిపారు. ఇలాంటి ఊహలతోనే కిరణ్ కుమార్ గోపరాజును పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. కానీ.. వివాహం అయిన తర్వాతే.. తనకు అసలు జీవితం అంటే ఏంటో అర్థమవడం మొదలు పెట్టిందన్నారు. చిన్న వయసులోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు సునీత. ఆ తర్వాత దాదాపు 15 సంవత్సరాలు ఒంటరిగా జీవితంతో పోరాటం చేశానని భావోద్వేగానికి లోనయ్యారు.
  
ఈ క్రమంలోనే రామ్ పరిచయం అయ్యారని తెలిపారు. అయితే.. ఆయనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనపై విమర్శలు ఆగట్లేదని చెప్పారు. తాను కేవలం డబ్బు కోసమే రెండో పెళ్లి చేసుకున్నాననే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. అందులో వాస్తవం లేదన్నారు.  
 
అంతేకాదు.. అసలు రామ్ ను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా చెప్పారు సునీత. పెళ్లి ప్రపోజల్ చేసిన రామ్‌.. తనను బాగా చూసుకుంటానని చెప్పారన్నారు. అయితే.. ఒకవేళ నువ్వు పెళ్లికి అంగీకరించకపోయినా.. తన జీవితాన్ని ఇక్కడితో ఆపనని, ముందుకు నడిపిస్తానని చెప్పినప్పుడు ఆలోచించానన్నారు. అప్పుడు అతనిలో నిజాయితీ తనకు కనిపించిందని, అది నచ్చిందని, అందుకే పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు సునీత.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు