శక్తిమేరకు ప్రాణం పోస్తానంటున్న రియల్ హీరో.. ఇతర దేశాలతో చర్చలు

మంగళవారం, 11 మే 2021 (16:21 IST)
దేశాన్ని కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కమ్మేసింది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టే లేకుండాపోయింది. ఈ వైరస్ ప్రస్తుతం మరణహోమం సృష్టిస్తోంది. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్‌లో మరణాల రేటు తక్కువగా ఉండటంతో కేంద్రం ఈ కరోనా ప్రభావాన్ని చాలా తక్కువగా అంచనా వేసింది. కరోనాను కట్టడిచేసినట్టు చంకలు బాదుకుంది. 
 
కానీ, రెండో దశ వ్యాప్తికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంటోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కళ్లముందే అయినవారిని కోల్పోతున్నా.. ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యులు ఉండి పోవాల్సిన పరిస్థితి దారుణాతిదారుణమైన దృశ్యాలు ప్రతినిత్యం కనిపిస్తున్నాయి. 
 
సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీలేకుండా పోయాయి. మరి సెకండ్ వేవే ఇంత దారుణంగా ఉంటే.. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఏంటి? ఊహిస్తుంటేనే భయంకరంగా ఉంది కదా. అందుకే థర్డ్ వేవ్ అంటూ వస్తే.. ఎదుర్కొవడానికి ప్రభుత్వాలు ఏమో గానీ.. ప్రజల మనిషిగా, ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజలు దేవుడిగా భావిస్తోన్న సోనూసూద్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 
 
సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది గమనించిన సోనూసూద్ థర్డ్ వేవ్‌లో ఆక్సిజన్ పాత్ర మరింతగా ఉండే అవకాశం ఉందని భావించి.. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను నెలకొల్పాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి ఓ ప్లాంట్‌కి ఆర్డర్ చేశామని.. మరో 10-12 రోజులలో అక్కడ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్లుగా సోనూసూద్ తెలిపారు. 
 
అలాగే ఇంకొన్ని దేశాల నుంచి.. ప్లాంట్‌లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సోనూ ప్రకటించారు. 'ప్రస్తుతం సమయం అనేది అతి పెద్ద సవాలుగా మారింది. ప్రతీది సమయానికి అందించేలా.. మా వంతుగా ఎంతగానో కృషి చేస్తున్నాము. ఇక మన ప్రాణాల్ని కాపాడుకోగలం' అని సోనూ సూద్ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు