మరింతగా క్షీణించిన ఎస్పీబాలు ఆరోగ్యం.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందనీ...

శుక్రవారం, 21 ఆగస్టు 2020 (08:55 IST)
గానగంధర్వుడు, భారతీయ చిత్రపరిశ్రమ నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయనకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు పసిగట్టారు. దీన్ని నివారించేందుకు ఎక్మో సపోర్టును సమకూర్చాలని భావిస్తున్నారు.
 
కరోనా వైరస్ కారణంగా ఆగస్టు 5వ తేదీన కరోనా వైరస్ బారిన ఎస్పీబీ.. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఆరంభంలో ఆయన బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ, ఇపుడు అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేక ఐసీయూ వార్డుకు తరలించి, లైఫ్‌సపోర్టుతో ఆయనకు వైద్యబృందం చికిత్స అందిస్తోంది. 
 
ఈ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం వరకు వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్న ఆయనకు తాజాగా ఎక్మో సపోర్ట్‌ను కూడా అమర్చామని హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధా భాస్కరన్ వెల్లడించారు. ఎస్పీ బాలూకు చికిత్స విషయంలో విదేశీ వైద్య నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. ఆయనకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నందునే ఎక్మో మద్దతును అందించాలని వైద్య నిపుణులు భావించారని అన్నారు.
 
ఆసుపత్రిలో చేరిన తొలినాళ్లలో సాధారణ చికిత్సను నిర్వహించిన వైద్యులు, ఆపై ఐసీయూకు తరలించి, ఈసీఎంఓ మద్దతుతో చికిత్సను చేస్తూ, నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతోందని, చికిత్సకు స్పందిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, శరీరంలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటంతో, ఆయన శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో వెంటిలేటర్‌ను అమర్చారు. 
 
అది కూడా ఫలితాన్ని ఇవ్వక పోవడంతో ఇప్పుడు ఎక్మో వ్యవస్థతో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్పృహలో లేరని, చికిత్స జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించడంతో, అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఆయన కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు