అందం రెట్టింపు కోసం వెళితే.. ఉన్న అందం పోయింది... బోరున విలపిస్తున్న తమిళ నటి!

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (10:12 IST)
మహిళల అందానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అందులోనూ నటీమణుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫేషియల్స్‌ అని, సర్జరీలు అని అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు నానాతంటాలు పడుతుంటారు. 
 
ఈ క్రమంలో ముఖం మీద చిన్న గీత పడినా విలవిల్లాడిపోతుంటారు.. అయితే తాజాగా ఫేషియల్‌కు వెళ్లిన ఓ తమిళ నటికి చేదు అనుభవం ఎదురైంది. తన ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేయడం కాదు కదా, ఉన్న సహజత్వాన్ని నాశనం చేస్తూ ఆమెను ఓ వైద్యురాలు అందవికారంగా మార్చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళ సినీ నటి రైజా విల్సన్. సాధారణ ఫేషియల్‌ కోసం ఓ క్లినిక్‌కు వెళ్లింది. కానీ అక్కడి మహిళా డాక్టర్‌ చర్మానికి మరింత నిగారింపు తీసుకొస్తానంటూ బలవంతంగా ఆమెకు చర్మ చికిత్సకు ఒప్పించింది. అయితే, ఆ చికిత్స కాస్త వికటించి నటి కన్ను కింద వాచిపోయింది. అది ఉబ్బిపోయి ముఖారవిందాన్ని దెబ్బ తీస్తోంది. 
 
దీంతో భంగపాటుకు గురైన నటి.. "నాకు అవసరం లేకపోయినా డాక్టర్‌ భైరవి‌ నాకేదో ట్రై చేసింది. చివరికి ఫలితం ఇదిగో ఇలా వచ్చింది.. దీని గురించి నిలదీద్దాం అంటే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోంది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారు" అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో యాడ్‌ చేసింది. 
 
'డా.భైరవి తనదగ్గరకు వచ్చే కస్టమర్లపై వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ప్రయోగాలు చేస్తుంది' అంటూ పలువురు నెటిజన్లు వాపోయారు. దీంతో తనలాంటి బాధితులు చాలామంది ఉన్నారని తెలిసి నటి షాక్‌కు గురైంది.
 
కాగా రైజా 2017లో 'వెలయ్యిలా పట్టధారి 2' సినిమాలోని ఓ చిన్నపాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అనంతరం తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లోనూ పాల్గొంది. 2018లో 'ప్యార్‌ ప్రేమ కాదల్‌' సినిమాతో హీరోయిన్‌గా మారింది. దీనికిగానూ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సైతం అందుకుంది. ప్రస్తుతం ఆమె 'అలైస్'‌, 'కాదలిక్క యారుమిల్లై', 'హ్యాష్‌ట్యాగ్‌ లవ్‌' అనే సినిమాలు చేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు