కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

ఠాగూర్

గురువారం, 19 సెప్టెంబరు 2024 (15:08 IST)
తెలుగు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అరెస్టు చేశారు. ఆయన బెంగుళూరులో ఉండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడకు వచ్చిన జానీ మాస్టర్ భార్య సుమలత.. తన భర్త అరెస్టుపై స్పందించేందుకు నిరాకరించారు. గురువారం మధ్యాహ్నం నార్సింగి పోలీసు స్టేషన్‌కు ఆమె వచ్చారు. ఈ క్రమంలో జానీ మాస్టర్‌పై కేసు, అరెస్టు తదితర విషయాలపై ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు యత్నించగా సుమలత స్పందించలేదు. ఓ ఫేక్‌‌కాల్‌ వచ్చిందని.. ఆ విషయంపైనే పీఎస్‌కు వచ్చినట్లు తెలిపారు.
 
తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ (21) ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. బాధితురాలు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు. అతడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్‌ను అరెస్ట్‌ చేశారు. 
 
మరోవైపు, జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి తాజాగా నటుడు మంచు మనోజ్ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు.  'జానీ మాస్టర్‌.. కెరీర్‌ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసు. కానీ, ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది.
 
ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీస్‌, బెంగళూరు నగర పోలీస్‌లకు నా అభినందనలు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. నిజాన్ని ఎదుర్కొండి. మీరు ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయండి. మీరు దోషి అయితే.. దానిని అంగీకరించండి' అని హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు