మ్యాడ్ గ్యాంగ్ కి తిరిగి స్వాగతం పలకడానికి సరైన గీతం అన్నట్టుగా 'వచ్చార్రోయ్' ఎంతో ఉత్సాహభరితంగా ఉంది. 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటల బాటలోనే.. 'వచ్చార్రోయ్' కూడా విడుదలైన నిమిషాల్లోనే శ్రోతల అభిమాన గీతంగా మారిపోయింది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో స్వరపరచి, ఈ పాటను స్వయంగా ఆలపించగా.. ప్రతిభావంతులైన దర్శకుడు కె.వి. అనుదీప్ సాహిత్యం అందించడం విశేషం.
భీమ్స్ సిసిరోలియో తనదైన ప్రత్యేక శైలి సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. భీమ్స్ సంగీతం, గాత్రం ఈ పాటను చార్ట్ బస్టర్ గా మలిచాయి. ఇక కె.వి. అనుదీప్ సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "ఏసుకోండ్రా మీమ్స్, చేసుకోండ్రా రీల్స్, రాసుకోండ్రా హెడ్ లైన్స్.. ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్" వంటి పంక్తులతో అందరూ పాడుకునేలా గీతాన్ని రాశారు. యువత కాలు కదిపేలా ఉన్న ఈ గీతం, విడుదలైన కొద్దిసేపటిలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం.. 'మ్యాడ్ స్క్వేర్'లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. మ్యాడ్ లో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్, మురళీధర్ గౌడ్, కె.వి. అనుదీప్ కీలక పాత్రలలో అలరించనున్నారు. అలాగే, రెబా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు.
'మ్యాడ్ స్క్వేర్' చిత్రానికి ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సమిష్టి కృషితో.. మొదటి భాగానికి రెట్టింపు వినోదాన్ని 'మ్యాడ్ స్క్వేర్' అందించనుంది.
శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం థియేటర్లలో అడుగు పెట్టనుంది.