పవన్ సినిమాకు కథను అందించనున్న మాటల మాంత్రికుడు

బుధవారం, 6 మే 2020 (12:09 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల మధ్య ఉన్న స్నేహం, అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు  సినిమాలు రాగా అందులో రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాటిలో ఒకటి "జల్సా", రెండోది "అత్తారింటికి దారేది". రెండేళ్ళ క్రితం వచ్చిన "అజ్ఞాతవాసి" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తుందన్న ఊహాగానాలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇతర హీరోలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పవన్‌తో సినిమా చేసే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. దీంతోనే పవన్ సినిమాకు మాటలు, కథను అందించాలని భావిస్తున్నారు. 
 
ప్రస్తుతం పవన్ తన తాజా చిత్రంగా 'వకీల్ సాబ్' చేస్తున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రాన్ని  చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు పూర్తికాగానే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు.
 
ఈ సినిమా తర్వాత 'డాలీ' దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గోపాల గోపాల' హిట్ మూవీగా నిలిచింది. డాలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్, ఆ సినిమాకి కథ, మాటలు అందించవలసిందిగా త్రివిక్రమ్‌ను కోరగా ఆయన గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
గతంలో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించిన 'తీన్‌మార్' సినిమాకి త్రివిక్రమ్ సంభాషణలు అందించిన సంగతి తెలిసిందే. పవన్ సినిమాకి త్రివిక్రమ్ కథ, మాటలను అందించనుండటం, ఈ ప్రాజెక్టు క్రేజ్‌ను పెంచుతుందనే చెప్పచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు