తన నటనతో పాత్రలకు ప్రాణం పోసిన బాలీవుడ్ నటుడు ఓంపురి ఇకలేరు. 66 యేళ్ళ ఓంపురికి శుక్రవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో తీవ్ర అస్వస్థకు గురైన ఆయన తన స్వగృహంలోనే కన్నుమూశారు. తెలుగులో 'అంకురం' చిత్రంలో నటించిన ఓంపురి... తన అద్భుత నటనతో పలుమార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఓంపురి మరణంతో బాలీవుడ్ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
ఓంపురి హర్యానాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్ 18, 1950లో జన్మించారు. పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూల్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1976లో మరాఠీ చిత్రం 'ఘాశీరామ్ కొత్వాల్'తో సినీరంగ ప్రవేశం చేశారు.
1982లో 'అరోహణ్', 1984లో 'అర్ధ్ సత్య' చిత్రాలకుగాను ఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' పురస్కారం పొందారు. ఓంపురి మరణంపై టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.