శ్రోతలకు 'ప్రేమ బృందావనం' పంచిన అమృత గాయకుడు జి. ఆనంద్ కరోనా కాటుకు కన్నుమూత

శుక్రవారం, 7 మే 2021 (09:08 IST)
కరోనా వైరస్ మరో సినీ నేపథ్య గాయకుడిని మింగేసింది. ప్రముఖ తెలుగు గాయకుడు జి ఆనంద్ కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. నాలుగురోజుల క్రితం కరోనా లక్షణాలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ ఆక్సిజన్‌ స్యాచురేషన్‌ లెవల్స్‌ 55కు పడిపోవడంతో పరిస్థితి విషమించి గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 
 
ఆయన వయసు 70 సంవత్సరాలు. ఈయన పూర్తి పేరు గడెల ఆనంద్‌ రావు. సినిమాల్లో తక్కువ పాటలే పాడినా ఆ కొన్నే ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. అమెరికా అమ్మాయి చిత్రంలోని ‘ఒక వేణువు వినిపించెను.. అనురాగ గీతికా’, స్నేహబంధం చిత్రంలో ‘స్నేహబంధము ఎంత మధురము’, కల్పన చిత్రంలోని ‘దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మా’తో పాటు ‘మల్లెల వేళ.. అల్లరి వేళ’ వంటి పాటలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. 
 
ముఖ్యమంగా ఆయన ‘స్వరమాధురి’ పేరుతో ఓ సంగీత బృందాన్ని ఏర్పాటు చేసి దేశవిదేశాల్లో 6,500కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనలతో ఆయన స్వరమాధురి ఆనంద్‌గా గుర్తింపు పొందారు. జి.ఆనంద్‌ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాలోని తులగం గ్రామం. 
 
తండ్రికి నాటక రంగంలో ప్రవేశం ఉండటంతో ఆయన్నుంచే ఆనంద్‌కు సంగీతం అబ్బింది. జి.ఆనంద్‌ ఏడాది క్రితమే అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. గాంధీనగర్‌లో భార్యతో కలిసి ఉంటున్నారు. ఆయన పిల్లలు అమెరికాలోనే ఉంటున్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు